వ్యవసాయం లో జీవావరణ పద్దతులు:  సేంద్రియ వ్యవసాయం

వ్యవసాయం ఎలా వుండాలి, వ్యవసాయంలో అభివృద్ధి, ఆధునికత అంటే ఏమిటి, ఎలాంటి వ్యవసాయం రైతుల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది, ఎలాంటి ఆధునిక సాంకేతికత వ్యవసాయ అభివృద్ది కి తోడ్పడుతుంది, ఎలాంటి వ్యవసాయం రైతులకు ఆహార భద్రత సమకూర్చుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం చాలా కష్టమైన విషయం.   అన్ని రంగాలలో వున్నట్టే ఈ రంగంలోనూ అభివృద్ధి గురించి భిన్నమైన దృక్పధాలు, విభిన్నమైన ఆలోచనలు వున్నాయి.  ఈ భిన్న­భిన్న దృక్పధాలను ఆలోచనలనూ ప్రతిభింబిస్తూ అనేక వాదనలు, ప్రతివాదనలు పుట్టుకువస్తున్నాయి.  ఇవన్నీ కలిసి సామాన్య రైతును మరింత అయోమయానికి గురి చేస్తున్నాయి.  ఈ పరిస్థితులలో ఏలాంటి వ్యవసాయ పద్ధతులు అవలంభించాలి, తమ పంట పొలాలను, తమ జీవితాలను, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇలాంటి విషయాలపై నిర్ణయాలు తీసుకునేముందు వేటికి ప్రాముఖ్యత ఇవ్వాలి, అలాగే వివిధ విధానాలు, పద్ధతుల మధ్యలో తేడాలు, అలాగే ప్రచారం లో వున్నా కొన్ని అపోహలు లాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన కలిగించటం ఈ వ్యాసం ముఖ్య వుద్దేశం.

ఆధునిక వ్యవసాయం: ఆధునిక పద్ధతులన్నీ ఏ స్థాయి రైతుకైనా, ఏ ప్రాంత రైతులకైనా, ఏ పరిస్థితులకైనా ఒక్కలాగానే పని చేస్తాయనే భావన అధునిక వ్యవసాయం ప్రధాన లక్షణం.  అలాగే ఆధునిక వ్యవసాయం మనం పండించే పంటకు మిగితా జీవాలన్నిటిని పోటీగా భావిస్తుంది.  దాంతో వేరే మొక్కలని (చివరికి అదే పంటకు చెందిన వేరే రకాలైనా) కలుపుగా భావిస్తుంది.  ఒకే పంట ను అధిక విస్తీర్ణం లో, పంటలో కూడా ఒకే రకాన్ని ఎక్కువ విస్తీర్ణం లో పండిచటం వలన జీవ వైవిధ్యం దెబ్బ తినటంతో పాటు పురుగులు తెగుల్ల సమస్య పెరుగుతుంది. పంట మీద వుండే పురుగులన్నిటినీ శత్రువులుగా చూడటం వలన వాటిని చంపే ప్రయత్నంలో వాడే రసాయనాలు కలుపును, పురుగులనే కాక అనేక ఉపయోగపడే మొక్కలను, కీటకాలను ఇతర జీవాలను అంతం చేస్తున్నాయి.  ఒకప్పుడు పిట్టల కిలకిలారావాలతో కలకల లాడే ఊర్లు ఇప్పుడు నిశబ్ధమైపోయాయి. కందిరీగలు, తేనెటీగలు, కన్పించటం లేదు.  ఇవి పోతే పోయాయి కనీసం పంటలు బాగున్నాయా అంటే అదీ లేదు.

ప్రకృతిలో సమతుల్యత దెబ్బతినటంతో చీడపీడల సమస్యలు అధికమయ్యాయి.  ఈ పోటీ అనేక కొత్త రసాయనాలను మార్కెట్టులోకి తెస్తుంది, అవి వచ్చినంత త్వరగానే నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఎంచుకునే ఒత్తిడి (సెలెక్షన్‌ ప్రెషర్‌) పెరిగి అవి తొందరగా తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాయి.  ఈ రసాయనాలు, ఇంకా రసాయనిక ఎరువుల వాడకంతో నేలలోని సూక్ష్మజీవులు చనిపోయి, సహజంగా ప్రకృతి నుంచి లభించే పోషకాలు మొక్కలకు అందకుండా పోతున్నాయి.  నేలలోని సేంద్రియ పదార్దాలపాలు తగ్గటంతో మట్టిలో తేమను పట్టివుంచే గుణం తగ్గుతోంది.  దీనికి తోడు వర్షాలు సరిగ్గా పడక పోవటం, భూగర్భ జలాలు అడుగంటి పోవటం వంటి సమస్యలతో పాటు, ఈ రసాయనాల అవశేషాలు మట్టి భౌతిక, రసాయనిక లక్షనాలను కూడా పాడు చేసి పొలాలను బీడుగా మారుస్తున్నాయి.  ­dటన్నిటికి తోడు ఈ రసాయనాల కొనుగోళ్ళతో ఖర్చు అధికంగా పెరిగి రైతులకు అప్పుల భారం ఒక వైపు తోడై, సరైన గిట్టుబాటు ధర లభించక నష్టాల భారం ఇంకొక వైపు తోడై, ఆవేశంలో దాడులు చేయటం లేకపోతే నిరాశలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు దారితీస్తున్నాయి.

విదేశాలలో ఇలాంటి వ్యవసాయం బాగా జరుగుతింది కదా! అలాంటివ్యవసాయ పద్ధతులను అవలంబిస్తేనే  దేశ ఆహార భధ్రత కల్పించగాలుగుతమని ప్రభుత్వ, శాస్త్ర వేత్తల వాదన.  అయితే అది మనకు ఎంత ఉపయోగం? మన పరిస్థితులకి ఎంత అనుగుణం అని అర్థం చేసుకోవాలంటే…అమెరికా వ్యవసాయ రంగ పరిస్థితిని మనం సమీక్షించుకోవాలి.  మనకు లాభసాటి అని చెప్పబడుతున్న అమెరికా వ్యవసాయం…పూర్తిగా ప్రభుత్వ సబ్సిడితో నడుస్తుంది.  ఎకరానికి సుమారుగా రెండు లక్షల రూపాయల sసబ్సిడీ అందుతుంది.  మన దగ్గర మహా అయితే ఐదు వేల రూపాయలు అదీ ఎరువుల సబ్సిడి రూపం లో…రసాయనిక ఎరువులు వాడని వారికి అది కూడా దొరకదు.  ఖర్చుల విషయం చెప్పకుండా కేవలం సాంకేతిక అభివృద్ధి అనీ పేరుతో, దేశ ఆహార భద్రత పేరుతో ఈ పద్ధాలను ప్రోత్సహించటం వలన..వున్న కొద్దిపాటి సబ్సిడీలు ఇటువంటి పద్ధతులకే ఇవ్వటం వలనా రైతులంతా రసాయనిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు.

సాంప్రదాయ వ్యవసాయం: ఆధునిక వ్యవసాయానికి ఎంత ప్రచారం కల్పించినప్పటికి వనరులు సమృద్ధిగా వున్నప్రాంతాలకి, పొలాలకి, రైతులకి పరిమితం అయిపోయింది.  వర్షాధార ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో, చిన్న సన్నకారు రైతులు ఇంకా చాలా మంది పాత పద్ధతులతోనే వ్యవసాయం చేస్తున్నారు.  ఆధునిక వ్యవసాయం ఈ పరిస్థితులకు అనుగుణంగా పద్ధతులను అభివృద్ధి చేయటానికి ఉపయోగపడక, విదేశీ విజ్ఞానం పేరుతో ఇక్కడి జీవావరణానికి, రైతుల ఆర్ధిక, సామజిక పరిస్థితులకు అనుగుణంగా లేని ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశ పెట్టటానికి ప్రయత్నం చేసింది. ఉత్పాదకాల కోసం మార్కెట్‌ మీద ఆధార పడటం ఎక్కువ అవటంతో అధునిక పద్ధతులు అవలంభించిన రైతులు మొదట్లో లాభాలు గడించినా, క్రమేపీ ఎక్కువగానే నష్టపోయారు.  అయితే సాంప్రదాయిక పద్ధతులలో దిగుబడులు తక్కువ వుండటం, సాంప్రదాయక పంటలకు మార్కెట్లో డిమాండ్‌ లేకపోవటంతో రైతుల పరిస్థితులు బాగుపడటం లేదు.  చాలా ప్రాంతాలలో రైతుల పరిస్థితులు బాగుపడటం లేదు.  చాలా ప్రాంతాలలో ఇవి కేవలం అక్కడి స్థానిక ఆహార అవసారాలను కొంత మటుకు తీర్చటానికి పరిమితమైపోయాయి.

ఆధునిక వ్యవసాయ పద్ధతులలోని నష్టాలు, పర్యావరణానికి కలుగుతున్న ముప్పు, ఆరోగ్యానికి కలుగుతున్న హాని గుర్తెరిగి, రసాయనిక పదార్ధాల స్థానంలో సేంద్రీయ పదార్ధాల వినియోగాన్ని పెంచుకునే దిశలో ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు.  దీనికి తోడు వినియోగదారులలో ఆహార పదార్ధాలలో ఆధునిక రసాయనాల అవశేషాల పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఈ పద్ధతులకు ప్రాముఖ్యత కలిగిస్తోంది.  అయితే, వినియోగదారులలో  వీdటి వైపు పెరుగుతున్న ఆదరణ చూసి, ఈ పద్ధతులను నియంత్రించటానికి పశ్చిమ దేశాల్లో ఇప్పటికే ఆధునిక సూపర్‌ మార్కెట్లు ప్రయత్నాలు ప్రారంభించాయి.  ఏ పద్ధతులు అవలంభించవచ్చు, ఏవి  అవలంభించకూడదు, అన్న వాటిపై ప్రమాణాల పేరుతో నియంత్రణ సాధించటానికి సర్టిఫికేషన్ పేరుతో ప్రయత్నం చేస్తున్నాయి.  అయితే సేంద్రియ పద్ధతులలో వున్న ఉపయోగాలు గుర్తించి, ఈ మార్కెట్‌ ప్రమాణాలనుంచి, రైతులు తమ ప్రమాణాలను నిర్దేశించుకునే దిశగా కొన్ని సంఘాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

సహజ వ్యవసాయం: జపాన్‌ కు చెందిన ‘ముసనోబు ఫుకువోకా’ ప్రారంభించిన ఒక ఉద్యమం ఈ సహజ వ్యవసాయం.  ప్రకృతిలోని సహజత్వాన్ని ఎక్కువ మార్పు లేకుండా చేసే పద్ధతులతో చేసే వ్యవసాయం. అయితే ఇది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోయింది.

జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం: మహారాష్త్ర కు చెందినా ‘సుభాష్ పాలేకర్’ గారు ప్రారంబించిన ఈ ఉద్యమం ఇప్పుడు దేశ వ్యాప్తం గా ప్రాచుర్యం పొందినది.  మహారాష్ట్ర లో దభోల్కర్ ప్రారంబించిన ఉద్యమం లోనుంచి పుట్టిన అనేక ప్రత్యామ్నాయ పద్ధతులలో ఇది ఒకటి. ఆవు పేడ మూత్రం, వేపాకులు లాంటి స్థానిక వనరులు వాడి  చేసుకునే అనేక రకాల ఉత్పత్తులతో పంటలను పండించు కోవటం ఇందులో ప్రధాన విధానం. వీటితో పాటు నేలను కప్పి ఉంచటానికి ‘అచ్చాధం’ (ముల్చింగ్), చిన్న మడులలో బహుళ పంటల విధానం ఇందులో ముఖ్య మైన అంశాలు.

పెర్మాకల్చర్‌:  ‘పెర్మనెంట్‌-అగ్రికల్చర్‌’ అనే రెండు ఆంగ్ల పదాల కలయికతో ఏర్పడిన పదం.  పొలాన్ని ప్రకృతి సూత్రాలకి అనుగునంగా డిజైన్‌ చేయటం ఇందులోని ప్రత్యేకత.

బయో-డైనమిక్ వ్యవసాయం: స్విట్జర్లాండ్ కు చెందిన రుడోల్ఫ్ స్టినేర్ గ్రహాల గమనాన్ని బట్టి పంటలు వేసుకునే విధానాల్ని, కొన్ని ప్రకియల ద్వారా వ్యవసాయం వాడే నీరు, విత్తనాలలో ‘కాస్మిక్ ఎనర్జీ’ వచ్చేలా చేయటం, పంట వ్యర్దాల్ని, పశు వ్యర్ధల్ని వాడుకొని కంపోస్ట్ చేసి వాడుకోవటానికి కొన్ని కొత్త పద్దతులు కనిపెట్టారు.   

సుస్థిర వ్యవసాయం:  ఆధునిక వ్యవసాయం లోని లోటు పాట్లు, సమస్యలను అధిగమించటానికి, సాంప్రదాయకంగా రైతుల వద్ద వున్న ­జ్ఞానం అందించిన ఆలోచనలను జోడించి, స్తానిక వనరుల మీద, స్థానిక జీవావరణం మీద ఆధారపడి చేసే వ్యవసాయం ఆర్ధికంగా, పర్యవరణ పరంగా వ్యవసాయాన్ని సుస్థిరత్వం చేస్తుంది. సహజ వనరులైన, గాలి, నీరు, మట్టి లని, జీవరాశులకి నష్టం కలుగకుండా,  పొలం స్థాయిలో,పరిస్థితుల కనుగుణంగా  రైతు స్థాయి లో, రైతు బృందాల స్థాయి లో, గ్రామస్థాయిలో…ఈ వనరులను సమీకరించుకోవటం పై కేంద్రీకరించటం ఈ రకమైన విధానాలలో ముఖ్యాంశం.

ప్రస్తుతం మార్కెట్‌ పై ఆధారపడే చాలా వనరులని రైతుల తమ విజ్ఞానం, నైపుణ్యత, శ్రమ, ప్రకృతిలో లభించే వనరులతో, సహజ ప్రక్రియలను పునరిద్ధరించటం ద్వారా వాడుకోవచ్చును.

ఆధునిక వ్యవసాయం లో రైతులు తమ విజ్ఞానం అంతా కోల్పోయి, కేవలం మార్కెట్‌, పత్రికలు, శాస్త్రవేత్తలు అందించే సమాచారంతో మార్కెట్లో దొరికే వస్తువులు కొనుక్కుని వాడుకునే వినియోగదారులుగా మిగిలిపోతున్నారు.  సుస్థిర వ్యవసాయం లో ఈ పద్ధతులకు స్వస్తి చెప్పి, తమ విజ్ఞానాన్ని పెంచుకుని, తమ వనరులపై ఆధారపడి వ్యవసాయం చేసుకునే పరిస్థితులలోకి చేరవచ్చును.

సుస్థిర వ్యవసాయానికి ప్రధాన సూత్రాలు

పంటలు విత్తనాలు:  తమ పొలాలకి, వనరులకి, ఎలాంటి పంటలు,  విత్తనాలు, రకాలు సరిపోతాయి, అన్నది అర్ధం చేసుకొని ఎంపిక.  మార్కెట్‌ పై ఆధారపడకుండా జన్యు వైవిధ్యం పాటిస్తూ తమ విత్తనాలు తామే సేకరించి వాడుకోవటం. ఉదా: పత్తి పంటలో వర్షాధార ప్రాంతాలలో, లోతు తక్కువున్న ప్రాంతాలలో హైబ్రిడులకు బదులు సూటి రకాలు తక్కువ దూరం తో నాటుకొని (ఎకరానికి ఎక్కువ మొక్కలు వచ్చేలా) తక్కువ కాలం లోనే మంచి పంట సాదించు కోవచ్చు

భూమిలో పోషకాలు: సుస్థిర వ్యవసాయం కేవలం పంట మీదనే  కాక మట్టి స్వభావాన్ని పెంచటం పై దృష్టి పెడుతుంది, సేంద్రియ ఎరువుల వాడకం, మట్టిలోని సూక్ష్మజీవుల సహకారం, ఆధునిక కంపోస్టింగు ప్రక్రియల వాడకం చేయవచ్చు.  అన్నీ పద్దతులలోను ముఖ్యమైనది నెలలో సేంద్రియ పదార్థాలను పెంచటం. కనీసం ఎకరానికి రెండు నుంచి నాలుగు టన్నుల వరకు జీవ పదార్థాలను ప్రతి సంవత్సరం నెలకు అందించాలి. దీనికోసం పంట వ్యర్ధాలను, పచ్చి రొట్ట ఎరువులను వాడుకోవచ్చు. అలాగే నేలలో వుంటే పోషకాలు మొక్కలకు అందుబాటులోకి తెచ్చేటందుకు వివిధ సూక్ష్మ జీవుల సహకారం తీసుకుంటుంది.   అయితే పైన చెప్పిన పద్ధతులన్నీ లోను వాడె ఉత్పదకాలన్ని కూడా స్థానికంగా దొరికే మొక్కల భాగాలు వాడుకొని తాయారు చేసే కాషాయాలు, పశువుల పేడ-మూత్రం పులియ పెట్టి తాయారు చేసే ద్రవనాలు వాడుకునేవే.

నీటి యాజమాన్యం: సుస్థిర వ్యవసాయం నేలలో తేమనురక్షించుకోవటానికి ­­ధ పద్ధతులు, నేలలో సేంద్రీయ పదార్ధాల పెంపు, భూమి కప్పించి వుంచే పంటలు, మల్చింగ్‌, పంటల ఎంపిక, ­ధానాలలో మార్పు.

పురుగుల యాజమాన్యం: రసాయనిక పురుగుమందులను పూర్తిగా మానివేయటం, పురుగులు ఎప్పుడు సమస్యగా మారతాయో అర్ధం చేసుకోవటం, పురుగు వివిధ దశలు అర్ధము చేసుకొని,  ఏ దశలో ఎలాంటి చర్యలు  చేపట్టి పురుగులు సమస్యగా మారకుండా వుంచుకోవచ్చో అర్ధం చేసుకుని పాటించటం, నష్టం కలుగ చేసే స్థాయిలోనే నివారణ చర్యలు చేపట్టటం, ప్రకృతి లో వున్న సమతుల్యాన్ని కాపాడుకోవటం వలన పురుగు ఉధృతి ఎక్కువైతే స్థానిక వనరులు ఉపయోగించి నివారణ చర్యలు చేపట్టటం, సహజ ప్రక్రియలను సమర్ధవంతంగా వినియోగంచుకోవటం.

ఖర్చు: స్థానిక వనరులపై ఆధారపడటం వలన ఖర్చు తక్కువ, నష్టం కలుగచేసే స్థాయిలోనే నివారణ చర్యలు, మార్కెట్‌ ఆటు పోట్లను కొంతవరకూ తట్టుకోగలగటం.

ఈ రకమైన మార్పు నిజమైన ఆధునికత అవుతుంది.  రైతులు తమపై తాము నమ్మకం పెంచుకొని చేసే వ్యవసాయంతో లాభసాటి కావటమే కాక, పర్యావరణానికి కలిగే నష్టాలను తగ్గిస్తుంది.

బాక్స్ ఐటమ్స్

౧. సుస్థిర వ్యవసాయానికి కావలిసిన వనరులున్నాయా?

సుస్తిర వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడినప్పుడల్లా ఎదురయ్యే పెద్ద ప్రశ్నలు కేవలం ..పెడ వాడి పంటలు పండిచ్చ కలుగుతమా? దేశ అవసరాలు తీరుస్తాయా? అసలు కావలసినంత పెడ వుందా?

ఒక సారి మన దేశం లో వాడ బడుతున్న రసాయనిక ఎరువుల సంగతి చూద్దాం…గత సంవత్సరంలో లో వినియోగం సుమారు 250 లక్షల టన్నులు .  వీటిల్లో నత్రజని, భాస్వరము, పొటాష్ (NPK) లు తీసుకుంటే 170 లక్షల టన్నులు. వీటి వాడక సామర్ధ్యం 50 % కంటే తక్కువ. అంటే దీంట్లో కేవలం 90 లక్షల టన్నుల  కంటే తక్కువే మొక్కలకి ఉపయోగ పడతాయి.. మిగిలింది అంతా భూగర్భ జలాలను, భూములను నాశనం చేస్తాయి.  దీనికి తోడూ మనం అడగాల్సిన ఇంకో ప్రశ్న –పెట్రోల్ ఉత్పత్తుల మీదా, భూగర్భ ఖనిజాల పైనా ఆధార పడిన ఈ రసాయనిక ఎరువులు మనకి ఇంకా ఎంత కలం అందుబాటు లో వుంటాయి?  ఇప్పుడు వాడుతున్నట్టు గానే వాడితే పెట్రోలియం నిలువలు ఇంకో యాభై అరవై సంవత్సరాలలో, పోటాష్ నిలువలు ఇంకో ముప్పై నలభై  సంవత్సరాలలో అయిపోతాయి..ఆ తర్వాత అయినా మనం మారాల్సిందే!

సేంద్రీయ పద్ధతులలో పేడని కేవలం నత్రజని, భాస్వరము, పొటాష్ అందించే రసాయన పదార్ధం గా చూడకుండా, గాలినుంచీ నత్రజని మొదలైన వాయువులను నైట్రేట్ల రూపం లో స్థిరీకరించే సూక్ష్మ జీవులను అందించే వనరుగా చూస్తాం.  ఈ సూక్ష్మ జీవులు పశువుల కడుపులో వుంటూ అవి తినే ఆకులూ, కొమ్మలను జీర్ణం చేసుకోవటం లో సహాయం చేస్తాయి.  వీటిని వాడినప్పుడు భూమిలో కూడా అటువంటి పనే చేస్తాయి..దానికి తోడు భూమిలో వుంది అందుబాటులో లేని భాస్వరం లాంటి పోషకాలను అందుబాటులోకి తెస్తాయి.  అయినా కేవలం  నత్రజని, భాస్వరము, పొటాష్ ల గురించి ఆలోచించినా, దేశం లో పంట మిగులు, పశువుల పెడ రూపం లో చాలా నే దొరుకుతాయి.

 

వనరులు పరిమాణం (సంవత్సరానికి) NPK రూపం లో
రసాయనక ఎరువులు 240 లక్షల టన్నులు 170 లక్షల టన్నులు
పంట మిగులు 3000 లక్షల టన్నులు 62.0 లక్షల టన్నులు
పశువుల పెడ 3200 లక్షల టన్నులు 112.0 లక్షల టన్నులు
పట్టణాల వ్యర్దం 5161 (గ్రామాలూ/పట్టణాలు) nనుంచి 400 లక్షల టన్నులు. ఇందులో 40 శాతం సేంద్రీయ పదార్థం వుంటుంది 6.0  లక్షల టన్నులు

అయితే ఇవి సేకరించటం లో సమస్యలు-ఖర్చులు-శ్రమ వున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం రసాయనిక ఎరువుల మీద పెడుతున్న 60 వేల కోట్ల సబ్సిడి లో (2009 లో అది 120 వేల కోట్లు వున్నది. అప్పటినుంచి భారాన్ని రైతుల మీదకు మార్చారు) లో కొంత భాగాన్ని రైతులకి నేరుగా సుబ్సిడిల రూపం లో అందించ వచ్చు.

౨. దేశి ఆవు లేక పోతే సేంద్రియ వ్యవసాయం చేయలేమా?

మనం తరచూ వినే మాట దేశి ఆవు పేడ మాత్రమే వాడాలని చెప్తూ వుంటారు దానితో మిగితా జీవాలు వున్నా ఉపయోగ పడవేమో అని చాల మంది రైతులు సేంద్రియ వ్యవసాయానికి మారటానికి బయపడుతున్నారు. నిజానికి ఆవు అయినా, గేదె అయినా..గడ్డి, పచ్చి రొట్ట ల మీద ఎక్కువగా ఆధార పడినవైతే వాటి పేడని రైతులు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కాకపోతే కష్టమైన వాతావరణం లో కూడా దేశి ఆవు తట్టుకుంటుంది కాబట్టి కొత్తగా పశువులు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు దేశి అవును కొనుక్కుంటే మంచిది.

౩. సేంద్రియ వ్యవసాయం రసాయనిక వ్యవసాయం కంటే ప్రమాదకరమా?

ఈ మధ్య కొంత మంది సహజ వ్యవసాయ ఉద్యమం లో వున్నా వాళ్ళు ..ముక్యం గా సుబాష్ పాలేకర్ గారి శిష్యులు సేంద్రియ వ్యవసాయం రసాయనిక వ్యవసాయం కంటే ప్రమాదకరం అని ప్రచారం చేస్తున్నారు. ఇది శుద్ధ తప్పు. వారి భయాలకు, అపోహలకు రెండు ప్రధాన కారణాలు వారు చెప్పేది…సేంద్రియ వ్యవసాయం పేరుతో కంపెనీ లు తమ జీవ ఉత్పత్తులను అమ్ముకున్తున్నాయి అని. ఇది కొంత వరకు నిజమే కాని దేశం లో తొంబై తొమ్మిది శాతం సేంద్రియ రైతులు తమ సొంత ఉత్పదకాలే చేసుకుంటున్నారు.  రెండవది..వెర్మి కంపోస్ట్ (వాన పాముల ఎరువు) భూమి లో భార లోహాలు పెంచుతుంది, అసలు వీటి కోసం వాడే విదేశీ వానపాములు అత్యంత ప్రమాదకరం అని. ఇది కూడా పూర్తిగా అపోహే…వానపాములలో భూమి పైన పాకేవి, భూమి లోపలికి తోలుచుకొని వెళ్ళేవి రెండు రకాలవి వుంటాయి. భూమి లోకి తొలుచుకు వెళ్ళే వాటిని వాడితే కంపోస్ట్ గుంత లోనుంచి భూమి లోకి వెళ్లి పోతాయి కాబట్టి పైన పాకే వాటిని వాడతారు. మన దేశం లో సుమారు మూడు వందల రకాల వాన పాములు వున్నాయి…అందులో కొన్ని పైన పాకేవి ఇంకొన్ని భూమి లోకి తొలుచుకు వెళ్ళేవి. ఈ వానపాములు భార లోహాలు పెంచుతాయి అన్నది కూడా పెద్ద అపోహే. పంట వ్యర్ధలలోని భార లోహాలే కంపోస్ట్ లోకి వస్తాయి కాని వానపాములు కొత్తగా తాయారు చేయవు. పంట వ్యర్ధాలు కంపోస్ట్ గా మరే క్రమం లో మొత్తం పరిమాణం బాగా తగ్గుతుంది కాబట్టి భార లోహాల మోతాదు కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది అంటే. కంపోస్ట్ చేయకుండా ముల్చింగ్ చేసినా లేక భూమిలో కలిపినా ఇదే జరుగుతుంది.

 

తొలకరి, జనవరి 2015